అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో విశిష్ఠమైన భూలోకంలో ధర్మజ్యోతులను ప్రజ్జ్వలింప చేయాలనే శ్రీశైవక్షేత్ర నిర్మాణ సంకల్పం
శ్రీశైవక్షేత్ర దర్శన ఫలసూక్తములు (వివరణ) వ్యాఖ్యానము
శివమతధర్మస్థాపన – శివతత్త్వ ప్రచారం శివమందిరాల నిర్మాణం
యుగాలు మారినట్లు యుగధర్మాలు మారుతాయి. ఈ కలియుగంలో శివారాధనను మించినది మరొకటి లేదు. కుల, మత, జాతి, వర్గ, వర్ణ, లింగ, వయోభేదములు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రేమతో కూడిన ఆనందమయ జీవితాన్ని పొందాలి. ఆనందమే శివుడు. ప్రతి ఒక్కరు భగవంతునికి స్వయంగా సేవచేసుకునే భాగ్యాన్ని కలుగ చేయాలనే సదుద్దేశంతో శ్రీ పార్వతీపరమేశ్వరుల ఆశీర్వాద బలంతో ఇక్కడ దివ్యసిద్ధ శ్రీశైవక్షేత్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. విశ్వశాంతి కొరకు లోకకళ్యాణార్థం శివమతస్థాపన, శివతత్త్వ ప్రచారంతో, అఖిలాండకోటి బ్రహ్మాండాలలో విశిష్ఠమైన భూలోకంలో ధర్మజ్యోతులను ప్రజ్జ్వలింపచేయాలనే అఖండ సంకల్పమే.
శ్రీశైవక్షేత్రము – శ్రీ శివక్షేత్రము- భూకైలాసము
శ్లో॥ శ్రీశైవక్షేత్రసమాగమమ్ |
కలికల్పమష తిరోగమమ్
అనగా కలియుగములోని మానవులంతా యుగధర్మ ప్రకారము కలిపురుషుని యొక్క దుష్ట స్వభావజనితములైన పాపకర్మాచరణాసక్తులై వారివారి స్వధర్మములను విడిచి కలుషాత్ములై చరింతరు. యిది ఈ కలియుగ ధర్మము, కలియుగమున కాలమంతయు దోషములచే నిండియుండునుగాన నట్టి కాలమును లక్ష్యపెట్టక నేరిక నుండరాదు. లోకమంతయు పాప పంకిలమై పుణ్యము నాచరింపకుండును. బ్రాహ్మణ క్షత్రియ ద్వివర్ణముల యాచారములు లోపించుట, వర్ణ సంకరము సంప్రాప్తమై ప్రజలు తమ యధికారమును పోగొట్టుకొని గొప్పవారు తుచ్చ స్థితికి వచ్చుట, నీచులు ఉన్నత పదవులు సధిష్ఠించుట, సదుపదేశము ఉపయోగింపక గురుశిష్య క్రమము భంగపడును.
ఇది కలిపురుషుని యొక్క దుష్ట స్వభావజనిత ఫలితము. ఇట్టి కలిపురుషుని యొక్క ప్రకోపజనిత దురితములకు తగుల్కొనకు మానవుడు ఆ దురితముల నుండి తప్పించుకొని వారివారి స్వధర్మములను పాటించి భగవదానుగ్రహము పొందవలెనన్న, పరిపూర్ణ శివకటాక్షంతో భూకైలాసంగా అవతరించిన ఈ శ్రీశైవక్షేత్రమునకు సద్భుద్ధితో వచ్చి – క్షేత్ర దర్శనము చేసుకొన్న ఆ మరుక్షణమే అతనిలో నున్న కలికల్మష దోష మంతయు రుద్రుని యొక్క రౌద్రానలవీక్షణ తాకిడికి పటాపంచలై కలి తిరోగమించును – (అనగా కల్మషమంతయు ఆ భక్తుని విడిచి వెడలిపోవును.)
కలిదోషములు అనివార్యములుగా గల మానవులు పరమేశ్వరుని యందు భక్తి కలవారై స్వయంభు, దైవ, ఋషి, మానుష్య నిర్మిత శివాలయాలలో అభిషేకార్చనలు చేసిన యెడల సంసారబంధముల నుండి విముక్తులగుదురు.
